మీరు "అప్పుల అప్పారావు " సినిమా చూసారా? అందులో "నాదెండ్ల అంజయ్య" గుర్తున్నాడా? డైలాగులు మక్కీకిమక్కీ గుర్తులేవుగాని అందులో ఒక సీను మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది.
(నాదెండ్ల అంజయ్య (బాబూ మోహన్) జనాన్ని వెంటేసుకొని హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంటికొస్తాడు)
హీరో: అల్లో అల్లో నాదెండ్ల అంజయ్య గారూ ఏమిటిలా జనాన్ని వెంటేసుకొచ్చారు ?
బాబూ మోహన్: నేను వెంటేసుకొని రావటం ఏమిటీ నా చింతకాయ్ (ఇది ఆయన ఊతపదం)
హీరో : మరి?
బాబూ మోహన్: (మొహం అదోలా పెట్టి) నేను వాళ్ళని వెంటేసుకు రాలేదు వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు.
ఈ మధ్య నాకు కేసీఆర్ ని చూసినప్పుడల్లా ఈ సీనే గుర్తుకొస్తోంది .ఈయన అప్పుడపుడు స్టూడెంట్స్ ని వెనకేసుకొచ్చినా, చాలా సార్లు పాపం వాళ్ళే ఈయన్ని ముందెట్టుకొస్తుంటారు(గతిలేక ).ఒకరోజు నెత్తి నెట్టుకుంటారు. ఆ మరుసటి రోజే కిందకి దింపి ఆయన శవ యాత్రలూ లేదా దిష్టిబొమ్మ దహనాలూ చేస్తుంటారు . వీలయితే ఆయనకే "ఆల్టిమేటం" జారీ చేస్తుంటారు. రాజకీయ నాయకుల్లో అవినీతి పరుల్నీ, పదవి కోసం ఎంతకైనా తెగించే వారినీ , బంధు ప్రీతి,కుల గజ్జి అణువణువునా జీర్ణించుకున్న వాళ్ళని చూసాం. కానీ ఈయన లాంటి ఏకకాలంలో హీరో కం జీరో లాంటి లీడర్లు చాలా అరుదు. ఎవరు ఎవర్ని నడిపిస్తున్నారో కూడా అర్ధంగాని రీతిలో ఉద్యమాన్ని (?) నడపటం ఈయనకే చెల్లు. ఏమంటారు?